Hajipur: హాజీపూర్ ఘటనపై తొలిసారి స్పందించిన కేటీఆర్!

  • మల్యాల సర్పంచ్‌కు ఫోన్ చేసిన కేటీఆర్
  • ఫలితాల తర్వాత గ్రామాన్ని సందర్శిస్తానని హామీ
  • కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు

సంచలనం సృష్టించిన హాజీపూర్ ఘటనపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బాధపడుతున్నారని అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన శ్రీనివాసరావును శిక్షించాలని డిమాండ్ చేస్తూ హాజీపూర్‌లో బాధిత కుటుంబాలు దీక్ష చేపట్టాయి. ఇందుకు సంబంధించిన ఫొటోను మల్యాల గ్రామ సర్పంచ్ కేటీఆర్‌ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

స్పందించిన కేటీఆర్ మల్యాల సర్పంచ్ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. హాజీపూర్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారని, మరోసారి ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక హాజీపూర్‌ను సందర్శిస్తానని కేటీఆర్ తెలిపారు.

More Telugu News