Telangana: ప్రియుడితో పెళ్లికి అడ్డుగా భర్త.. చంపేసి వెళ్తే ముఖం చాటేసిన ప్రియుడు!

  • మద్యానికి బానిసైన భర్త
  • పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం
  • భర్తను చంపేస్తే పెళ్లాడతానన్న ప్రియుడు

ప్రియుడిని పెళ్లాడేందుకు కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిందో ఇల్లాలు. ఆ తర్వాత ప్రియుడి వద్దకు వెళ్తే పెళ్లి చేసుకోను పొమ్మన్నాడు. దీంతో వేరే గత్యంతరం లేక పోలీసుల వద్దకెళ్లి మొత్తం విషయాన్ని వివరించి నేరాన్ని అంగీకరించింది. తెలంగాణలోని జనగామ జిల్లాలో జరిగిన ఈ దారుణం  నాలుగు నెలల తర్వాత వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని చిలుపూరుకు చెందిన వెలిశాల రవి(39), రజిత భార్యాభర్తలు. వీరికి 14 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు.  భర్త మద్యానికి బానిస కావడంతో ఇంటిపక్కనే ఉండే మాచర్ల సాంబరాజుతో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రజిత-సాంబరాజులు రవిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. రవిని హత్య చేసిన అనంతరం రజితను పెళ్లాడతానని సాంబరాజు ఆమెకు హామీ ఇచ్చాడు.

ఈ ఏడాది జనవరి 29న మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిద్రపోతున్న రవి మెడకు చున్నీ బిగించి ఇద్దరూ కలిసి హత్య చేశారు.  అనంతరం అతిగా మద్యం తాగి తన భర్త ప్రాణాలు కోల్పోయాడంటూ రజిత అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. బంధువులు, గ్రామస్థులు కూడా ఆమె చెప్పింది నమ్మేశారు. భర్తను హతమార్చి నాలుగు నెలలు గడుస్తున్నా సాంబరాజు పెళ్లి ఊసెత్తకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో శనివారం పోలీసులను ఆశ్రయించిన రజిత.. తన భర్త హత్య, సాంబరాజుతో వివాహేతర సంబంధం తదితర విషయాలన్నీ పూసగుచ్చినట్టు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News