Lagadapati: పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు: లగడపాటి జోస్యం

  • ఏపీలో సంకీర్ణం రాదు
  • కచ్చితమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడుతుంది
  • ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘనవిజయంతో ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అన్నారు. అయితే జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు కూడా బదులిచ్చారు. పవన్ కల్యాణ్ మెగాస్టార్ కు చిన్నతమ్ముడు కాబట్టి కాస్త తక్కువలోనే ఉంటాడని అనడం ద్వారా పెద్దగా సీట్లు రావన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.

జనసేన రాకతో టీడీపీ, వైసీపీలకు ఓటింగ్ శాతం తగ్గిందని వెల్లడించారు. అయితే, ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో హంగ్ రాదని, ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని లగడపాటి స్పష్టం చేశారు. కచ్చితమైన మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పడబోతోందని అన్నారు. రేపు కచ్చితమైన సంఖ్యలతో తిరుపతిలో సర్వే ఫలితాలు వెల్లడిస్తానని ఆయన మీడియాకు తెలిపారు. ఎవరు గెలుస్తారన్నది కాదని, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడమే తన ప్రతిష్ఠకు తగిన వ్యవహారం అని లగడపాటి స్పష్టం చేశారు.

More Telugu News