Chandrababu: ఈ నెల 23 తర్వాత చంద్రబాబును కలవడానికి ఎవరూ ఇష్టపడరు: జీవీఎల్

  • చంద్రబాబు అందుకే చెప్పులరిగేలా తిరుగుతున్నారు
  • టీడీపీ ఘోరంగా ఓడిపోతుంది
  • బాధను వ్యక్తం చేసుకోవడానికే సోనియా సమావేశం

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై విమర్శలు చేశారు. ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు. ఈ నెల 23 తర్వాత చంద్రబాబును కలిసేందుకు ఎవరూ ఇష్టపడరని వ్యాఖ్యానించారు. ఫలితాలు వచ్చిన తర్వాత తిరగడానికి ఏమీ ఉండదని తెలిసి, చంద్రబాబు ఇప్పుడే కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు.

ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ చతికిలపడితే, చంద్రబాబేమో ఆ పార్టీ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.  టీడీపీ అవినీతి కారణంగా సంపాదించిన డబ్బును అన్ని రాష్ట్రాల్లో పంచారని జీవీఎల్ ఆరోపించారు. ఇక ఈసారి కూడా బీజేపీదే విజయం అని ఆయన ధీమాగా చెప్పారు. పూర్తి మెజారిటీతో బీజేపీ గెలవబోతోందని, ప్రజలంతా మోదీ వైపే ఉన్నారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కు దక్కేది 55 సీట్లేనని, సోనియా గాంధీ ఈ నెల 23న పెట్టే సమావేశం కేవలం బాధను వ్యక్తపరుచుకోవడానికేనని అన్నారు.

More Telugu News