Narendra Modi: ‘మన్ కీ బాత్‌’ చివరి ఎపిసోడ్‌లా వుంది.. 'మోదీ ప్రెస్ మీట్'పై అఖిలేశ్ యాదవ్ చురక

  • చివరి విడత పోలింగ్‌ ప్రచారం ముగిశాక ప్రధాని మీడియా సమావేశం
  • ఇదే ఆయనకు చివరి సమావేశమని పలువురు నాయకుల ఎద్దేవా
  • ఓడిపోతానని ఆయన ముందే గ్రహించినట్టున్నారని ఎద్దేవా

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి విడత పోలింగ్‌కు ప్రచారం ముగిశాక ప్రధాని మోదీ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంపై విపక్ష నాయకులు పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘పాపం మోదీ...ఓటమి ఆయన ముఖంలోనే కనిపిస్తోంది’ అంటూ ఎద్దేవా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ మాట్లాడుతూ ప్రతి నెల రేడియో ద్వారా వినిపించే ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్‌’ చివరి ఎపిసోడ్‌లా ప్రధాని మీడియా సమావేశం ఉందన్నారు.  మోదీ కేవలం తొలిపలుకుకే పరిమితమై విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు.

మరో సీనియర్‌ నాయకుడు లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ అధినేత శరద్‌యాదవ్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ బీజేపీకి ఇదే చివరి విలేకరుల సమావేశమన్నారు. పోలింగ్‌కు ముందు నిర్వహించిన సమావేశంలో మోదీ హావభావాలు చూస్తుంటే ఓటమి ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ నేత ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొందరు బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపేందుకే ప్రధాని ఈ సమావేశం నిర్వహించారని విమర్శించారు. ఒకరిని ప్రశ్న అడిగితే మరొకరు సమాధానం ఇచ్చిన ఇటువంటి విలేకరుల సమావేశాన్ని ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌పటేల్‌ వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశం ఎదుర్కొనే ధైర్యం కూడా ప్రధానికి లేదని రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లోత్‌ అన్నారు.

More Telugu News