Aswini: ఆటో బోల్తా.. ఎంబీఏ విద్యార్థిని మృతి.. మరో ఆరుగురికి గాయాలు!

  • ఆటో డ్రైవర్ సహా ఐదుగురితో బయల్దేరిన ఆటో
  • మార్గమధ్యంలో ఆటో ఎక్కిన అశ్వని
  • టెంకాయ చిప్పలు తగిలి పగిలిన అద్దం

ఎవరో విసిరిన టెంకాయ చిప్ప ఆటోకి తగలడంతో అది బోల్తా పడి ఓ ఎంబీఏ విద్యార్థిని మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన పెద్దన్న ఆటో నడుపుతుంటాడు. అతని ఆటోలో గురువారం మధ్యాహ్నం ఏఎన్‌ఎంలు చంద్రకళ, వెంకట లక్ష్మీ, ఎస్తేర్, షాకీర్, ఫార్మసిస్ట్ హర్ష అనంతపురానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వడియంపేట వద్ద ఎంబీఏ విద్యార్థిని అశ్విని ఆటో ఎక్కింది. ఆటో తడకలేరు వద్దకు రాగానే ఎదురుగా గుంతకల్లుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు నుంచి ఎవరో టెంకాయను రోడ్డుపైకి బలంగా విసిరారు.

ఆ పగిలిన టెంకాయ చిప్పలు వేగంగా ఆటో అద్దానికి తగలడంతో అద్దం పగిలింది. ఈ అనూహ్య పరిణామంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఆటోలోని వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన అనంతపురంలోని సర్వజనా ఆసుపత్రికి తరలించారు. అశ్వని పరిస్థితి విషమించడంతో నేడు ఆమె మృతి చెందింది. మిగిలిన ఆరుగురు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

More Telugu News