shiva prasad: అది విష ప్రయోగమా? లేక దాని వల్ల టీడీపీకే మేలు జరుగుతుందా? అనేది చూడాలి: రీపోలింగ్ పై ఎంపీ శివప్రసాద్

  • అనవసరంగా రీపోలింగ్ తీసుకొచ్చారు
  • ఓటు వేయకుండా ఆగిపోయే స్థితిలో ఎస్సీలు లేరు
  • ఎస్సీలను ఆదరించిన పార్టీ టీడీపీ

చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రీపోలింగ్ అనవసరంగా వచ్చిందని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా రీపోలింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు రీపోలింగ్ జరుగుతున్న గ్రామాలన్నీ నూటికి నూరు శాతం టీడీపీ గ్రామాలని అన్నారు. పోలింగ్ జరిగి దాదాపు 40 రోజులు అవుతోందని, కౌంటింగ్ తేదీ కూడా దగ్గరపడుతోందని... ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఊరంతా తిరుగుతూ 'అమ్మా ఓటు వేయండి' అంటూ అడగాల్సివస్తోందని అన్నారు. ఈ రీపోలింగ్ ను ప్రజలు కూడా అవమానంగా భావిస్తున్నారని చెప్పారు. మళ్లీ రీపోలింగ్ కు తీసుకొచ్చారని వైసీపీ మీద కోపంతో ఉన్నారని అన్నారు.

రీపోలింగ్ పెట్టినంత మాత్రాన ఈ గ్రామాల్లో ఒక్క ఓటు కూడా పక్కకు వెళ్లదని శివప్రసాద్ చెప్పారు. ఈ రీపోలింగ్ వల్ల వైసీపీ సాధించేది ఏమీ లేదని అన్నారు. ఎస్సీలు ఓటు వేయలేదనే కారణంతో రీపోలింగ్ జరుపుతున్నట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారని... ఓటు వేయించకుండా ఆపితే, ఆగిపోయే పరిస్థితిలో ఎస్సీలు లేరని చెప్పారు. తిరగబడి ఓటు వేసేంత పరిణతి ఎస్సీల్లో ఉందని అన్నారు. ఎస్సీలను ఎంతో ఆదరించిన పార్టీ టీడీపీ అని చెప్పారు. అలాంటి పార్టీతో ఆడుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు.

మోదీ, కేసీఆర్, జగన్, పవన్ అందరూ కలసి ప్రయోగం చేస్తున్నారని... అది విష ప్రయోగమా? లేక దాని వల్ల టీడీపీకే మేలు జరుగుతుందా? అనేది వేచి చూడాలని శివప్రసాద్ చెప్పారు. చంద్రబాబు తనకు క్లాస్ మేట్ అని... తనను ఎన్నోసార్లు ఆశీర్వదించారని తెలిపారు.

More Telugu News