Pakistan: పాకిస్థాన్ లో డాక్టర్ నిర్వాకం.. 400 మందికి ఎయిడ్స్ సోకేలా ఒకే సూదితో ఇంజెక్షన్లు!

  • ఒకే సిరంజీని వాడిన డాక్టర్
  • బాధితుల్లో అత్యధికులు చిన్నారులే
  • దాతల కోసం పాకిస్థాన్ ఎదురుచూపు

దాయాది దేశం పాకిస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ వైద్యుడు కలుషిత సిరంజీని వాడడంతో, దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్(హెచ్ఐవీ వైరస్) సోకింది. దీంతో సదరు డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్ కు తరలించారు. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ ముజఫర్ గంగర్ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. అయితే సిరంజీలు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఒకే సూదిని వేడినీటిలో మరగబెట్టి వాడటం ప్రారంభించారు. ఈ క్రమంలో దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్ సోకింది.

వీరిలో అత్యధికులు చిన్నపిల్లలే కావడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. హెచ్ఐవీ కేసులు బయటపడటంతో ఈ ఆసుపత్రి పరిధిలో చికిత్స పొందిన ప్రజలందరికీ హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘోరానికి కారకుడైన వైద్యుడు ముజఫర్ కు కూడా ఎయిడ్స్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే ఈ వ్యవహారంపై ముజఫర్ స్పందిస్తూ..‘నాకు హెచ్‌ఐవీ ఉన్న సంగతి తెలియదు. కావాలనే కలుషిత సిరంజి వాడానని చేస్తున్న ఆరోపణలు కూడా అవాస్తవం’  అని స్పష్టం చేశాడు.

కాగా, చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని పాకిస్థాన్ అధికారులు కోరుతున్నారు. ఎయిడ్స్ కేసులో పాకిస్థాన్ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది. ఒక్క 2017లోనే పాక్ లో కొత్తగా 20,000 కేసులు నమోదయ్యాయి.

More Telugu News