TV9 Raviprakash: అది పాత తేదీతో సృష్టించిన నకిలీ షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ మోసం కేసులో సైబర్‌ క్రైం పోలీసులు నిర్థారణ

  • పలు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
  • ఎన్‌సీఎల్‌టీలో కేసు వేయడం కోసం సృష్టించారని ఆధారాలు
  • రవిప్రకాశ్ చుట్టూ మరింత బిగియనున్న ఉచ్చు

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రవిప్రకాశ్‌, సినీనటుడు శివాజీల మధ్య జరిగినట్టు భావిస్తున్న ఒప్పందం ఎన్‌సీఎల్‌టీలో కేసు వేయడం కోసం పాత తేదీతో సృష్టించిన నకిలీదని నిర్థారించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సైబర్‌ క్రైం పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు గత ఏడాది ఫిబ్రవరి 20న శివాజీ కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాప్ట్‌ వాస్తవానికి  ఈ ఏడాది ఏప్రిల్‌ 13వ తేదీన తయారు చేసినట్లు గుర్తించారు. ఈ డ్రాప్ట్‌ను అదేరోజు సాయంత్రం 5.46 గంటలకు ఫైనాన్స్‌ అధికారి మూర్తికి మెయిల్‌ చేసిన శక్తి... రవిప్రకాశ్‌, ఎం.వి.కె.ఎన్‌.మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరికి కాపీలు పంపినట్లు సమాచారం. ఈ అంశంపై రవిప్రకాశ్, మూర్తి, హరిలతో, ఏబీసీఎల్‌ ఫైనాన్స్ అధికారి మూర్తి (మరో మూర్తి) మధ్య జరిగిన ఈ-మెయిల్‌ సంభాషణలను సైబర్ క్రైమ్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో వాస్తవం బయటపడింది.

ఈ-మెయిల్స్ ఆధారాలు దొరక్కుండా రవిప్రకాశ్, ఆయన అనుచరులు సర్వర్‌లో డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీసినట్లు సమాచారం. మరోవైపు శివాజీ, ఎన్‌సీఎల్‌టీలో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్‌ను విజయవాడకు చెందిన  ఓ న్యాయవాది రూపొందించినట్లు గుర్తించారు.

డ్రాప్ట్ సృష్టించిన మరునాడు అంటే ఏప్రిల్‌ 14న ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్‌లో ప్రస్తావించినట్టు గుర్తించారు. ఈ పిటిషన్‌పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్‌లో సంప్రదింపులు జరిపిన ఆధారాలను సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఈరోజు ఎన్‌సీఎల్‌టీలో జరగబోయే విచారణ మీదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More Telugu News