YSRCP: నాపై అసభ్య ఆరోపణలు చేసిన వాడిని శిక్షించాలి: లక్ష్మీపార్వతి

  • ఆ వ్యక్తి వెనుక టీడీపీ వ్యక్తులు ఉన్నారు
  • నిందితుడిని అరెస్టు చేసి నాలుగు తన్నాలి 
  • దీని వెనుక ఎవరున్నారో బయటపడుతుంది

తనపై అసభ్య ఆరోపణలు చేసిన వ్యక్తికి సరైన శిక్ష పడాలని వైసీపీ నేత లక్ష్మీపార్వతి కోరారు. సామాజిక మాధ్యమాల వేదికగా నటి పూనం కౌర్, లక్ష్మీపార్వతిపైనా అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఒకరేనని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. అయితే, నిందితుడు ఇంకా దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.

ఈ విషయమై లక్ష్మీపార్వతి స్పందిస్తూ, తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి వెనుక టీడీపీ వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. నిందితుడిని అరెస్టు చేసి, నాలుగు తంతే, దీని వెనుక ఉన్నదెవరో బయటకొస్తుందని అన్నారు. ఒక తల్లి వయసు ఉన్న తాను ఓ బిడ్డ లాంటి వాడికి మెస్సేజ్ లు పంపించానంటే ఎవరైనా నమ్మే విషయమేనా? అని ప్రశ్నించారు.

‘ఇవే కాదు ఎన్నో భరించాను. ఈ నీచుడు చంద్రబాబునాయుడు మొదటి నుంచి ఎన్నో రకాల అవమానాలు చేశారు. ధైర్యంగా నిలబడుతూ వాటిని ఎదుర్కొన్నాను. నా ధైర్యం.. నా నిజాయతి, నా విశ్వాసం’ అని అన్నారు. తనపై అసభ్య ఆరోపణలు చేసిన నిందితుడిని గుర్తించిన సైబరాబాద్ పోలీసులను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కేసులు ఎన్నో సైబరాబాద్ పోలీసులు పరిష్కరించారని, ఏపీ పోలీసులకు ఆ దమ్ము లేదని, ప్రభుత్వానికి తొత్తుల్లా ఉన్నారని ఆరోపించారు. అందుకే, సరైన నిర్ణయాలు వారు తీసుకోలేరని భావించే ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఒక తల్లి లాంటి వ్యక్తిని బజారులో పెట్టాలనుకున్న ‘నీచుడు’కి సరైన శిక్ష పడాలని కోరారు. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన నిందితుడు నివసించే గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నానని, అతన్ని పోలీసులు పట్టుకునేందుకు సహకరించాలని కోరారు.

More Telugu News