Mahesh Babu: ఏఎంబీ కంటే సుదర్శన్ 35ఎంఎం థియేటర్ నే నా సొంతదిగా భావిస్తాను: మహేశ్ బాబు

  • ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేశ్ బాబు సందడి
  • అభిమానులతో ముచ్చటించిన 'మహర్షి'
  • పూనకాలు వచ్చినట్టు ఊగిపోయిన ఫ్యాన్స్

మహర్షి చిత్రం రిలీజై సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో హీరో మహేశ్ బాబు తన చిత్రబృందంతో కలిసి విడుదల అనంతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35ఎంఎం థియేటర్ ను సందర్శించారు. మహర్షి చిత్రం ప్రదర్శితమవుతున్న ఆ సినిమా హాల్లో మహేశ్ రాకతో ఉత్సాహం ఉరకలెత్తింది. తమ అభిమాన కథానాయకుడ్ని చూసి ఫ్యాన్స్ ఊగిపోయారు.

ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ, సుదర్శన్ 35ఎంఎం థియేటర్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని, తన హిట్ చిత్రాల్లో అనేకం ఇక్కడ ప్రదర్శితమయ్యాయని చెప్పారు. ముఖ్యంగా మురారి చిత్రాన్ని ఇదే థియేటర్ లో తన తండ్రి కృష్ణ వీక్షించారని, అనంతరం భుజం తట్టి ప్రశంసించడాన్ని ఎప్పుడూ మర్చిపోలేనని తెలిపారు. అందుకే, తన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ కంటే సుదర్శన్ 35ఎంఎం థియేటర్ నే సొంత సినిమా హాల్ గా భావిస్తానని భావోద్వేగాల నడుమ వెల్లడించారు. చివర్లో మహేశ్ బాబు మరోసారి మీకోసం కాలర్ ఎగరేస్తున్నా అంటూ కాలర్ ఎగరేసి అక్కడి నుంచి నిష్క్రమించారు.

More Telugu News