Cricket: పెళ్లి విందుకి వచ్చి ఐపీఎల్ మ్యాచ్ లో లీనమైన అతిథులు.. బిక్కమొహం వేసిన వధూవరులు!

  • హైదరాబాద్ లో ఘటన
  • ఐపీఎల్ ఫైనల్ రోజునే పెళ్లి రిసెప్షన్
  • పెళ్లి వదిలేసి క్రికెట్ కు ప్రాధాన్యమిచ్చిన అతిథులు

క్రికెట్ అంటే భారత్ లో ఎంత పిచ్చో చెప్పడానికి ఇదే సరైన ఉదాహరణ. ఇటీవలే హైదరాబాద్ లో ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అదే రోజున నగరంలో ఓ పెళ్లి రిసెప్షన్ జరిగింది. సహజంగానే హైదరాబాదీలు క్రికెట్ ప్రియులు కావడంతో పెళ్లి విందుకు వచ్చిన వారి కోసం వేదికకు పక్కగా భారీ టెలివిజన్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇంకేముందీ, ఈ ఫంక్షన్ కు వచ్చినవాళ్లు వధూవరులను వదిలేసి ఎంచక్కా మ్యాచ్ లో లీనమైపోయారు.

కొందరైతే స్టేడియంలో మాదిరే సీట్లలోంచి లేచి మరీ మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య చివరి బంతి వరకు హోరాహోరీగా మ్యాచ్ జరగడంతో అతిథులు ఊపిరి బిగపట్టి మ్యాచ్ చూశారు. బౌండరీ కొట్టినా, వికెట్ పడినా గోల గోల చేశారే తప్ప తమను ఎవరూ పట్టించుకోకపోవడంతో వధూవరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంత ఖర్చుపెట్టి పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేస్తే అతిథులు క్రికెట్ మ్యాచ్ కోసమే వచ్చినట్టు ప్రవర్తించడం వాళ్లను దిగ్భ్రాంతికి గురిచేసింది.

More Telugu News