babu mohan: వీడు హీరోయిన్ తో డాన్స్ చేస్తాడా? ఎలా చేస్తాడో చూద్దాం అనుకున్నారు: నటుడు బాబూ మోహన్

  • 'మాయలోడు' సినిమా మొత్తం పూర్తయింది
  •  చివరి నిమిషంలో మరో పాట అనుకున్నారు
  • హీరోయిన్ తో డాన్స్ అంటే ఆశ్చర్యపోయాను

తాజా ఇంటర్వ్యూలో బాబూ మోహన్ మాట్లాడుతూ, 'మాయలోడు' సినిమాలో 'చినుకు చినుకు అందెలతో' పాటను గురించి ప్రస్తావించారు. "ఈ సినిమాలో ఈ పాటను ముందుగా అనుకోలేదు. సినిమా షూటింగు .. డబ్బింగ్ అయ్యాయి .. ఫస్టుకాపీ కూడా వచ్చింది. ఆ తరువాత ఈ పాటను నాతో చేయించాలనే నిర్ణయానికి కృష్ణారెడ్డిగారు .. అచ్చిరెడ్డిగారు వచ్చారు. నేను చెన్నైలో ఉండగా వచ్చి మరుసటి రోజు ఉదయాన్నే హైదరాబాద్ వచ్చేయమనీ, సారథీ స్టూడియోలో పాట చిత్రీకరణ ఉందని చెప్పారు. నేను ఆశ్చర్యపోతే 'నువ్వు చేయగలవు' అని అన్నారు.

దాంతో మరుసటి రోజు సారథీ స్టూడియోకి వెళ్లాను. పాట చిత్రీకరణకి ఏర్పాట్లు జరుగుతున్నాయి .. నన్ను రిసీవ్ చేసుకుని కాస్ట్యూమ్స్ ఇచ్చారు. ఒక పక్కన రాజేంద్ర ప్రసాద్ గారు .. ఒక పక్కన కోట గారు .. మరో పక్కన బ్రహ్మానందంగారు వున్నారు. నిజానికి ఆ పాట రాజేంద్రప్రసాద్ గారు చేయవలసింది .. కానీ అక్కడ ఏదో జరిగిందట .. అది మనకి సంబంధం లేని విషయం. నేను ఎప్పుడైతే కెమెరా ముందుకు వచ్చానో .. అందరూ నా వైపు అదోలా చూశారు. హీరోయిన్ తో వీడికి డాన్సా? ఎలా చేస్తాడో చూద్దాం ' అన్నట్టుగా నిలబడ్డారు. ఫస్టు షాట్ ఓకే .. రెండో షాట్ ఓకే .. మూడో షాట్ ఓకే .. పక్కకి తిరిగి చూస్తే అక్కడ కోటగారు .. రాజేంద్రప్రసాద్ .. బ్రహ్మానందం లేరు .. ఎటువాళ్లు అటెళ్లి పోయారు. ఆ పాటకి ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో మీకు తెలిసిందే" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News