BJP: కాంగ్రెస్‌కు ఓటేసిన కజిన్ పై కాల్పులు జరిపిన బీజేపీ నేత

  • బీజేపీకి ఓటేయమంటే కాంగ్రెస్‌కు వేశాడని ఘాతుకం
  • మూడుసార్లు కాల్పులు
  • పరారీలో నిందితుడు

తన సొంత కజిన్ కాంగ్రెస్‌కు ఓటెయ్యడాన్ని జీర్ణించుకోలేకపోయిన బీజేపీ నేత తుపాకితో అతడిపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. హరియాణాలోని ఝాజర్‌లో జరిగిందీ ఘటన. ఈ నెల 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగిన ఆరో విడత ఎన్నికల్లో బీజేపీ మండలస్థాయి నాయకుడైన ధర్మేంద్ర సిలానీ సొంత కజిన్ రాజా సింగ్ కాంగ్రెస్‌కు ఓటేశాడు. విషయం తెలిసిన సిలానీ అతడిపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. రెండుసార్లు కాళ్లపైన, ఓసారి కడుపులోనూ కాల్చాడు.

సిలానీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కుప్పకూలిన రాజా సింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సిలానీ కోసం గాలిస్తున్నారు. రాజా, అతడి కుటుంబ సభ్యులను బీజేపీకి ఓటేయాల్సిందిగా సిలానీ కోరాడని, అయితే వారు ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఓటేసిన విషయం తెలియడంతోనే ధర్మేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

More Telugu News