Andhra Pradesh: ఏపీలో రెచ్చిపోయిన సైకోలు.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళల గొంతు కోసి పరారీ!

  • గుంటూరు, కడప జిల్లాల్లో ఘటనలు
  • రేపల్లెలో నిర్మల అనే మహిళపై దాడి
  • కడప జిల్లాలో మరో మహిళపై ఘాతుకం
  • నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఓ మహిళ గొంతును కత్తితో కోసి పరారయ్యారు. రేపల్లె మండలం పేటేరు గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ రోడ్డుపై వెళుతుండగా కొందరు దుండగులు బైక్ పై ఆమెను అడ్డగించారు.

అనంతరం నడిరోడ్డుపై కత్తితో గొంతుకోసి పరారయ్యారు. నిర్మలను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు.

మరోవైపు కడప జిల్లాలోని బద్వేలులో ఉన్న నూర్ బాషా కాలనీలో ఓ మహిళపై దస్తగిరి అనే వ్యక్తి కత్తితో దాడిచేశాడు. సుబ్బలక్ష్మమ్మ అనే మహిళ ఈరోజు ఉదయం పాల కోసం వెళుతుండగా, దస్తగిరి అనే వ్యక్తి కత్తితో గొంతుకోశాడు. అనంతరం భుజంపై పొడిచి పారిపోయాడు.

రక్తపు మడుగులో పడిఉన్న సుబ్బలక్ష్మమ్మను గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. కాగా, ఈ దాడి ఎందుకు జరిగిందన్న విషయమై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. పరారీలో ఉన్న దస్తగిరిపై హత్యాయత్నం కేసు నమోదుచేసిన పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News