piyush goyal: తన తండ్రిని విమర్శించిన కేంద్ర మంత్రిపై మండిపడ్డ బాలీవుడ్ హీరో

  • విలాస్ రావ్ దేశ్ ముఖ్ పై పియూష్ గోయల్ విమర్శలు
  • మన మధ్య లేని వ్యక్తిపై విమర్ళలు ఎందుకన్న రితీశ్
  • ఏడేళ్ల క్రితం ప్రశ్నించి ఉంటే.. తన తండ్రి సమాధానమిచ్చేవారంటూ సెటైర్

2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల సమయంలో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ సరిగా బాధ్యతలను నిర్వహించలేకపోయారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విమర్శించారు. ఉగ్రదాడులు జరిగిన సమయంలో తన కుమారుడి సినిమా రోల్ పైనే ఆయన దృష్టి సారించారని దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో పియూష్ గోయల్ పై విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడు, బాలీవుడ్ నటుడైన రితీశ్ దేశ్ ముఖ్ మండిపడ్డాడు. ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉంటుందని... అయితే, సమాధానం చెప్పుకోవడానికి మన మధ్యలో లేని వ్యక్తిని నిందించడం సరికాదని అన్నాడు.

ఉగ్రదాడి చోటు చేసుకున్న తాజ్/ఒబెరాయ్ హోటల్స్ కు తాను వెళ్లిన సంగతి నిజమేనని... అయితే కాల్పులు, పేలుళ్లు జరుగుతున్న సమయంలో తాను అక్కడకు వెళ్లానని చెప్పడం మాత్రం అబద్ధమని రితీశ్ తెలిపాడు. తన తండ్రితో పాటు ఘటనా స్థలానికి తాను వెళ్లడం నిజమేనని... బాలీవుడ్ సినిమాలో తనకు ఒక రోల్ ను సంపాదించి పెట్టడానికి తన తండ్రి యత్నించారని చెప్పడం మాత్రం అబద్ధమని తెలిపాడు. తనను సినిమాలో తీసుకోవాలని ఏ దర్శకుడినీ, ఏ నిర్మాతనూ తన తండ్రి ఎప్పుడూ కోరలేదని చెప్పాడు. ఇదే ఆరోపణలు ఏడేళ్ల క్రితం చేసి ఉంటే... తన తండ్రి సమాధానం చెప్పేవారని అన్నారు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ జెనీలియా భర్తే రితీశ్ అన్న విషయం తెలిసిందే.

More Telugu News