Narendra Modi: మోదీజీ.. ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికి కూడా ఓ హద్దుండాలి!: ప్రకాశ్ రాజ్ చివాట్లు

  • మోదీ క్లౌడ్ థియరీపై పేలుతున్న జోకులు
  • తాజాగా కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
  • అడవిలో భారతం చదువుతూ టెక్నాలజీ పొందారని ఎద్దేవా

  మేఘాలు రాడార్ ను అడ్డుకుంటాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ స్థాయిలో జోకులు పేలుతున్నాయి. తాజాగా ఈ విషయమై నటుడు, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ సీటు స్వతంత్ర అభ్యర్థి ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు.

‘‘భారత్ లో పౌరులందరికీ డిజిటల్ టెక్నాలజీ, ఈ-మెయిల్ సౌకర్యం అన్నది 1990వ దశకంలో అందుబాటులోకి వచ్చింది. కానీ చౌకీదార్(మోదీ) అడవిలో ఉంటూ మేఘాలు ఆకాశంలో చుట్టుముట్టగా మహాభారతం చదువుతూ ఈ సాంకేతికతను 1980వ దశంలోనే సాధించారు. ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుంది భాయ్’’ అని ట్వీట్ చేశారు.

ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ..‘‘పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరంపై దాడిచేసేందుకు మేం సిద్ధం కాగా వాతావరణం సహకరించలేదు. ఆకాశంలో మబ్బులు ఏర్పడ్డాయి. దీంతో వాయుసేన అధికారులు సందిగ్ధంలో పడిపోయారు. అప్పుడు నేను ‘మరేం ఫరవాలేదు. మీరు దాడిచేయండి. మేఘాల కారణంగా మన విమానాలను పాక్ రాడార్లు గుర్తించలేవు’ అని చెప్పా. వెంటనే అధికారులు ఆపరేషన్ పూర్తిచేశారు’’ అని సెలవిచ్చారు. 

More Telugu News