IPL: 300 ఉచిత ఐపీఎల్ టికెట్లు పంపండి... అంటూ లెటర్ రాసి చిక్కుల్లో పడ్డ ఎక్సైజ్ శాఖాధికారి!

  • మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ అధికారిగా ప్రదీప్ రావు
  • భారీ సంఖ్యలో టికెట్లు కావాలంటూ అఫీషియల్ లెటర్
  • చార్జ్ మెమోను పంపించామన్న స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్

తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి, తనకు 300 ఐపీఎల్ టికెట్లు కావాలంటూ, అధికారిక లెటర్ హెడ్ పై సీల్ వేసి మరీ లేఖను రాసి ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఆదివారం రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ సాగగా, దీనికి తనకు 50 కాంప్లిమెంటరీ కార్పొరేట్ బాక్స్ టికెట్లు, 250 ఇతర టికెట్లను ఉచితంగా ఇవ్వాలని, తాను వాటిని ఉన్నతాధికారులకు పంపాలని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ అధికారి కే ప్రదీప్ కుమార్, హెచ్సీఏ క్రికెట్ అసోసియేషన్ సీఈఓకు లేఖ రాశారు.

 "12వ తేదీన జరిగే మ్యాచ్ కి సంబంధించిన టికెట్లను ఉన్నతాధికారులకు ఇచ్చేందుకు 300 టికెట్లను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను" అంటూ స్టాంప్, సీల్ వేసి మరీ ప్రదీప్ రావు లేఖను పంపారు. అయితే, ఆయనకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన హెచ్సీఏ, విషయాన్ని కమర్షియల్ టాక్సెస్ అండ్ ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లింది.

 ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన, విచారణకు ఆదేశించామని, ప్రదీప్ రావుకు చార్జ్ మెమో పంపామని అన్నారు. కాగా, ఐపీఎల్ టికెట్లను ఉచితంగా కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వారిలో ప్రదీప్ మొదటి వారేమీ కాదు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ను ఇలాగే అడిగిన కేంద్ర ఉన్నతాధికారి గోపాల కృష్ణన్ గుప్తాను విధుల నుంచి తొలగించారు.

More Telugu News