Telangana: సూర్యాపేటలో అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరి దుర్మరణం!

  • సూర్యాపేట జిల్లాలోని ముకుందాపురంలో ఘటన
  • ప్రమాదంలో మరో ఇద్దరి కి తీవ్రగాయాలు
  • హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుండగా ప్రమాదం

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం వద్ద వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన లోకేశ్, కిరణ్ కుమార్ లు చనిపోయారని తెలిపారు. వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News