parking fee: సినిమాహాల్‌లో పది రూపాయల పార్కింగ్ ఫీజు కోసం గొడవ.. వ్యక్తి హత్య

  • కాంచన-3 సినిమా చూసేందుకు వెళ్లిన ధరణి
  • పార్కింగ్ ఫీజు విషయంలో సిబ్బందితో గొడవ
  • థియేటర్ వెనక్కి తీసుకెళ్లి చావబాదిన సెల్వరాజ్

సినిమాహాల్‌లో పది రూపాయల పార్కింగ్ ఫీజు చెల్లించేందుకు నిరాకరించిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిందీ ఘటన. తూర్పు బెంగళూరులోని భారతీనగర్‌లో ఉన్న లావణ్య థియేటర్‌‌లో కాంచన-3 సినిమా చూసేందుకు ఆస్టిన్ టౌన్‌కు చెందిన భరణిధరణ్ (38) తన కజిన్‌తో కలిసి బైక్‌పై వెళ్లాడు.

థియేటర్ పార్కింగ్ వద్ద ఉన్న సెల్వరాజ్ బైక్ పార్కింగ్‌కు రూ.10 ఇవ్వాలని అడిగాడు. అందుకు భరణి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే థియేటర్‌లోని హౌస్ కీపింగ్‌ విభాగంలో పనిచేస్తున్న శేఖర్‌తో కలిసి భరణిపై సెల్వరాజ్ దాడిచేశాడు. థియేటర్ వెనక్కి తీసుకెళ్లి దారుణంగా కొట్టారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన భరణిని థియేటర్ యాజమాన్యం  అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించింది. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం పరారీలో వున్న నిందితులు సెల్వరాజ్, శేఖర్‌లను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News