Telangana: కేన్సర్‌తో బాధపడుతున్న తల్లి.. కొడుకుతో కలిసి శ్రీశైలం అడవుల్లో ఆత్మహత్య

  • వ్యాధి నయం కాకపోవడంతో తీవ్ర నిర్ణయం
  • ఆరు రోజుల క్రితం శ్రీశైలం అడవుల్లోకి 
  • ఆత్మహత్యకు ముందు బంధువులకు ఫోన్

కేన్సర్‌తో బాధపడుతున్న తల్లి తన వ్యాధి నయం కాదని తెలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తల్లి లేని జీవితం తనకెందుకని భావించిన కొడుకు తాను కూడా తల్లితో కలిసి ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ కలిసి శ్రీశైలం వచ్చి స్వామిని దర్శించుకున్న అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన మాధవి (34) రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతోంది. చికిత్స పొందుతున్నా నయం కాకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకుంది. ఆరు రోజుల క్రితం కుమారుడు కార్తీక్ (18)తో కలిసి శ్రీశైలం క్షేత్రానికి వచ్చింది. అనంతరం ఇద్దరూ కలిసి సాక్షి గణపతి ఆలయం సమీపంలోని అడవుల్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. బంధువుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు శుక్రవారం అడవిలోని తల్లీకుమారుల మృతదేహాలను గుర్తించారు. చనిపోయి దాదాపు వారం కావడంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News