Chiranjeevi: "హలో ఎవరు?" అన్నాను... "నేను చిరంజీవి" అంటూ అవతల్నుంచి వినిపించింది: వంశీ పైడిపల్లి

  • మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లికి అభినందనల వెల్లువ
  • ఫోన్ చేసి మాట్లాడిన మెగాస్టార్
  • మహర్షి గురించి ఐదు నిమిషాలు మాట్లాడిన వైనం

మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి చిత్రం గురువారం రిలీజైన సంగతి తెలిసిందే. సినిమాకు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతోపాటు భారీగా వసూళ్లు వచ్చిపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహర్షి చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, మహర్షి సినిమాకు సంబంధించి తనకు వచ్చిన అన్ని ఫోన్ కాల్స్ లో చిరంజీవి గారి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఎంతో విశిష్టమైనదని అన్నారు.

"చిరంజీవి గారి నంబర్ నా వద్ద లేకపోవడంతో ఎవరు చేశారో తెలియక "హలో ఎవరు?" అన్నాను. "నేను చిరంజీవి" అని అవతల నుంచి సమాధానం వచ్చింది. "నేను చిరంజీవి" అన్న మాట వినగానే ఒళ్లు గగుర్పొడిచిన ఫీలింగ్ కలిగింది. మహర్షి చిత్రం గురించి ఆయన 5 నిమిషాల పాటు మాట్లాడారు. చిరంజీవి గారి ఫోన్ కాల్ ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. చిరంజీవి గారు చివర్లో "వంశీ! ఇదే నా ఫోన్ నంబర్, సేవ్ చేసుకోండి" అనడం నాకు మరింత ప్రత్యేకం" అంటూ వంశీ పైడిపల్లి తన ఆనందమయ క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.

More Telugu News