tv9: నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు..ఆ పుకార్లు నమ్మొద్దు: ‘టీవీ 9’ సీఈవో రవి ప్రకాశ్

  • చాలా మంది గందరగోళానికి గురయ్యారు
  • ఆందోళన చెందాల్సిన విషయమేమీ లేదు
  • అందుకే, లైవ్ టెలీ కాస్ట్ లో మీ ముందుకు వచ్చా

ప్రముఖ మీడియా సంస్థ ‘టీవీ 9’ సీఈవో పదవి నుంచి రవిప్రకాశ్ ను తొలగించారన్న వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవి ప్రకాశ్ స్పందించారు. ఈరోజు రాత్రి ‘టీవీ 9’ స్డూడియోలో ఆయన లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడారు.

‘ఈరోజు ఉదయం నుంచి అనేక వార్తలు తెలుగు ప్రజానీకాన్ని, తెలుగు ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అదేవిధంగా, భారత మీడియా ప్రపంచంలో కూడా ఈ వార్తలు సంచలనం రేపుతున్నాయి. నేను రవిప్రకాశ్, ‘టీవీ 9’ ఫౌండర్ చైర్మన్, సీఈఓ. ‘టీవీ 9’ హెడ్ క్వార్టర్స్ బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు రవిప్రకాశ్ గురించి వస్తున్న వార్తల వల్ల చాలా మంది గందరగోళానికి గురయ్యారు. చాలా మంది నాకు, ‘టీవీ 9’ ఆఫీసుకు ఫోన్స్ చేస్తున్నారు. ఆందోళన పడాల్సిన విషయం ఏమీ లేదన్న సందేశాన్ని ఇచ్చేందుకే నేను ఈరోజు లైవ్ టెలీకాస్ట్ లో మీ ముందుకు వచ్చాను.

ప్రస్తుతం ఎన్సీఎల్టీ కేసు కోర్టులో ఉంది. 16వ తారీఖున ఆ కేసు విచారణకు రానుంది. ఆ వివాదాన్ని తీసుకుని కొంత మంది ఏవో తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. తప్పుడు కేసులు, అబద్ధాలు, అవాస్తవాలు నిలబడవు. ‘సత్యం’ మాత్రమే నిలబడుతుంది. రవిప్రకాశ్ రెండు రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం వాస్తవం కాదు. మొన్న సాయంత్రం 9 పీఎం లైవ్ షోలో టీవీ9 వీక్షకులు నన్ను చూశారు. నిన్న నేను బయట ఊరికి ప్రయాణం చేయడం వల్ల ఆఫీసుకి చేరుకోవడం కొద్దిగా ఆలస్యమైంది. కాబట్టి, పుకార్లు నమ్మొద్దు’ అని రవి ప్రకాశ్ కోరారు.

More Telugu News