Hyderabad: జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పైకి ఎక్కి, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వైనం!

  • కాఫీ తాగేందుకు లక్డీకాపూల్ నుంచి జూబ్లీహిల్స్ బయలుదేరిన స్నేహితులు
  • జర్నలిస్టు కాలనీ వద్ద అదుపు తప్పిన కారు
  • తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సైదాబాద్‌కు చెందిన షబీ బీటెక్ చదువుతున్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి బుధవారం అర్ధరాత్రి కాఫీ తాగేందుకు లక్డీకాపూల్ నుంచి  జూబ్లీహిల్స్‌కు కారులో బయలుదేరాడు.

కారును అతి వేగంగా డ్రైవ్ చేస్తున్న షఫీ జర్నలిస్టు కాలనీ వద్దకు వచ్చే సరికి నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు ఫుట్‌పాత్‌పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే, కారులోని ఎయిర్‌బ్యాగులు సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. నలుగురు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

కారు ఢీకొట్టినా స్తంభం పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఒకవేళ స్తంభం కిందపడి ఉంటే విద్యుదాఘాతంతో నలుగురూ ప్రాణాలు కోల్పోయి ఉండేవారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News