hariyana: దేశంలో ఎన్నో సమస్యలుంటే మోదీ నా గురించే మాట్లాడటం విడ్డూరం: రాబర్ట్ వాద్రా

  • మోదీ నన్ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు
  • ఐదేళ్లుగా నాకు వేధింపులు ఎదురవుతున్నాయి
  • ఇకనైనా నాపై వ్యక్తిగత విమర్శలను ఆపండి

దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ప్రధాని మోదీ తన గురించి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త  రాబర్ట్ వాద్రా విమర్శించారు. మోదీ ఎన్నికల ర్యాలీల్లో తనను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడంపై వాద్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో వరుస పోస్ట్ లు చేశారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, మహిళా సాధికారత మొదలైన సమస్యలు ఎన్నో ఉంటే వాటిని పక్కనపెట్టి తన గురించి మోదీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఐదేళ్లుగా మోదీ ప్రభుత్వం నుంచి తనకు వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, పన్నుల శాఖల నుంచి తనకు నోటీసులు అందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి చర్యల ద్వారా తనపై మానసిక ఒత్తిడి పడేలా చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రసంగాల ద్వారా తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను దయచేసి ఆపాలని కోరారు. ఇప్పటి వరకూ తనకు ఎన్నో సమన్లు జారీ చేశారని, అయితే, ఏ ఒక్క ఆరోపణను రుజువు చేయలేదని వాద్రా పేర్కొన్నారు.  

More Telugu News