postal ballets: ఒక్కొక్కరికీ రెండు లేదా మూడు పోస్టల్ బ్యాలెట్లు అందినట్టు ఫిర్యాదులు వచ్చాయి!: సీఈఓ ద్వివేది

  • ఈ మేరకు ఫిర్యాదులు అందాయి
  • ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు కోరాను
  • ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే చర్యలు  

పోస్టల్ బ్యాలెట్లపై కొన్ని చోట్ల ఫిర్యాదులు అందాయని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్కో నియోజకవర్గంలో 500 పోస్టల్ బ్యాలెట్లు ఉండొచ్చని, ఒక్కొక్కరికీ రెండు లేదా మూడు పోస్టల్ బ్యాలెట్లు అందినట్లు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ విషయమై ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు కోరినట్లు చెప్పారు.

ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక ఉద్యోగికి ఒకటికి మించి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం లేదని చెప్పారు. ఈ నెల 23న కౌంటింగ్ చేసే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, ఈ సిబ్బందిపై అభ్యంతరాలుంటే ఈసీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. గెజిటెడ్ స్థాయి అధికారులకు మాత్రమే కౌంటింగ్ విధులు కేటాయించినట్టు ద్వివేది తెలిపారు.  

More Telugu News