Maharashtra: నగ్న ఫొటోలు తీసి బెదిరించిన రూమ్ మేట్.. ప్రాణాలు తీసుకున్న యువకుడు!

  • మహారాష్ట్రలోని ముంబైలో ఘటన
  • మద్యం తాగించి స్పృహ కోల్పోగానే ఫొటోలు
  • వేధింపులు హద్దు దాటడంతో ఆత్మహత్య

రూమ్ మేట్ కు పూటుగా మద్యం తాగించిన ఇద్దరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. అతని దుస్తులు విప్పి నగ్నంగా ఫొటోలు తీశారు. తమకు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వాలనీ, లేదంటే వీటిని బయటపెడతామని బెదిరించారు. చివరికి ఈ వేధింపులు హద్దులు దాటడంతో బాధితులు ప్రాణాలు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని ముంబైలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ముంబైలోని బోయిసార్ ప్రాంతంలో ఉన్న ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న యువకుడి గదిలోకి ఇటీవల ఓ టీనేజర్ చేరాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరు, అదే ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న మరో వ్యక్తితో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా పూటుగా మద్యం సేవించిన టీనేజర్ స్పృహ కోల్పోయాడు. దీంతో ఇద్దరు ఉద్యోగులు అతని దుస్తులను విప్పి ఫొటోలు తీశారు. మరుసటి రోజు ఉదయం ఫొటోలను చూపించి డబ్బులు ఇవ్వాలనీ, లేదంటే వీటిని ఇంటర్నెట్ లో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు.

తొలుత దీన్ని సదరు టీనేజర్ జోక్ గా భావించాడు. అయితే ఇద్దరు స్నేహితులు వేధింపులు మొదలుపెట్టడంతో మనస్తాపానికి లోనయ్యాడు. సోమవారం ఇద్దరు ఆఫీసుకు వెళ్లగా, రూమ్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ప్రధాన నిందితుడి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా, చనిపోయిన టీనేజర్ నగ్న ఫొటోలు లభ్యమయ్యాయి. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News