America: అమెరికాలోని ఓ పాఠశాలలో కాల్పులు: ఒకరి మృతి...8 మందికి తీవ్రగాయాలు

  • క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరం
  • నిందితులు తోటి విద్యార్థులేనని అనుమానం
  • కొలరాడో రాష్ట్రం డెన్వర్‌లో ఘటన

ఆమెరికాలోని ఓ పాఠశాల విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అక్కడి కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో ఓ గదిలోకి ప్రవేశించిన దుండగులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. తుపాకీ విష సంస్కృతితో సతమతమవుతున్న అగ్రరాజ్యంలో తాజా ఘటన మరోసారి కలకలానికి కారణమైంది. తోటి విద్యార్థులే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గడచిన నెలరోజుల్లో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనల్లో ఇదొకటి. ఇటీవల ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. వెస్ట్‌బాల్టిమోర్‌, శాండియోగోలో జరిగిన ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News