Rajasthan: పోలింగ్ బూత్‌లో సహనం కోల్పోయిన రాజస్థాన్ మంత్రి.. మహిళా కానిస్టేబుల్‌పై అరుపులు

  • మంత్రి ఓటేస్తుండగా ఫొటో తీసేందుకు లోపలికి వెళ్లిన మీడియా
  • అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్
  • మంత్రినే ఆపుతావా? అంటూ విరుచుకుపడిన అమాత్యుడు

తాను ఓటు వేస్తుండగా ఫొటో తీసేందుకు వచ్చిన మీడియాను అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్‌పై రాజస్థాన్ మంత్రి విరుచుకుపడ్డారు. మంత్రిని నన్నే అడ్డుకుంటావా? అంటూ పైపైకి వెళ్లారు. సహనం కోల్పోయి కానిస్టేబుల్‌ను దుర్భాషలాడారు. రాజస్థాన్ సామాజిక న్యాయశాఖ, సాధికారత మంత్రి భన్వర్‌లాల్ మేఘ్‌వాల్ చురు జిల్లా, సుజన్‌గఢ్‌లోని వార్డ్ నంబరు 20లో ఓటేసేందుకు వెళ్లారు. ఆయనతోపాటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియాను అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ మనీషా ఖిచార్ అడ్డుకున్నారు.  

ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఓటింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ బూత్‌ లోపలికి మీడియాను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. తాను ఓటేస్తుండగా ఫొటో తీసేందుకు వచ్చిన మీడియాను అడ్డుకున్న కానిస్టేబుల్ వంక చురచురా చూసిన మంత్రి ఆగ్రహంతో ఆమె వద్దకు వచ్చారు. ‘ఎంత ధైర్యం ఉంటే మంత్రిని ఆపుతారు?.. నేను రాజస్థాన్ మంత్రినని తెలియదా?’’ అంటూ విరుచుకుపడ్డారు. మంత్రి ఆగ్రహం చూసి కానిస్టేబుల్ హడలిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

More Telugu News