Hyderabad: హైదరాబాద్‌లో జంట హత్యల కలకలం.. అత్తా కోడళ్లను ఇనుపరాడ్డుతో మోది దారుణంగా చంపిన దుండగులు

  • దోపిడీ దొంగల పనేనని అనుమానం
  • సోమవారం సాయంత్రమే హత్యలు జరిగి ఉంటాయన్న పోలీసులు
  • ఇంట్లోని బంగారం మాయం

హైదరాబాద్‌లో అత్తా కోడళ్ల జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ హత్యలు పోలీసులకు సవాలుగా మారాయి. నిజామాబాద్‌కు చెందిన మోహిన్‌ఖాన్ తల్లి సబియాబేగం(55)తో కలిసి నగరానికి వచ్చి పాతబస్తీలోని వట్టేపల్లి పరిధి షమాకాలనీలో నివసిస్తున్నాడు. ఆబిడ్స్‌ ట్రూప్‌ బజార్‌లోని ఓ శానిటేషన్‌ సామగ్రి దుకాణంలో మోహిన్‌ పనిచేస్తూ జీవిస్తున్నాడు. మార్చి 8న స్థానిక యువతి  తయ్యబాభాను(21)ను పెళ్లాడాడు. అంతకు రెండు రోజుల ముందు తన మకాంను  రోషన్‌కాలనీకి మార్చాడు.

రోజులానే సోమవారం ఉదయం పనికి వెళ్లాడు. రంజాన్ నెల ప్రారంభం కావడంతో సరుకులు తీసుకెళ్లాలని భావించాడు. సరుకుల గురించి అడిగేందుకు సోమవారం రాత్రి షాపు నుంచే భార్యకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎంతకీ రింగవకపోవడంతో సరుకులు కొని ఇంటికి వెళ్లాడు. మెయిన్ గేటుకు తాళం వేసి ఉండడంతో ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న చిన్నగేటు తెరిచి ఇంట్లోకి వెళ్లిన మోహిన్‌ నిర్ఘాంతపోయాడు. హాలులో తల్లి, పడక గదిలో భార్య రక్తపు మడుగులో విగతజీవులై పడి ఉన్నారు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

సోమవారం సాయంత్రమే ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. తొలుత బెడ్‌రూములో తయ్యబాభానును ఇనుప రాడ్డుతో తలపై కొట్టి చంపినట్టు గుర్తించారు. అనంతరం సబియాబేగంపై దాడి చేసి హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. ఇంట్లోని రెండున్నర తులాల బంగారం మాయం కావడంతో ఇది దొంగల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News