delhi: అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే: సీఎం చంద్రబాబు

  • సీఈసీని కలిసిన 21 పార్టీల  నేతలు 
  • వీవీప్యాట్స్ లెక్కింపు, ఈవీఎంల అంశంపై ఫిర్యాదు
  • 5 వీవీ ప్యాట్స్ స్లిప్పులు లెక్కించాక తేడా వస్తే ఏం చేస్తారు?: చంద్రబాబు

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) అరోరాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా 21 పార్టీలకు చెందిన నేతలు కలిశారు. వీవీప్యాట్స్ లెక్కింపు, ఈవీఎంల అంశంపై ఆయనకు ఫిర్యాదు చేశారు. సీఈసీని కలిసిన వారిలో టీడీపీ నేతలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, అభిషేక్ సింఘ్వీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే నేత ఇళంగోవన్, జేడీఎస్ నేత కుపేంద్రరెడ్డి, టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రే, ఆర్ఎల్డీ నేత అహ్మద్ హమీద్, ఆప్ నేత సంజయ్ సింగ్, ఐయూఎంఎల్ నేత అనిస్ ఒమర్, సీపీఎం, సీపీఐ నేతలు తదితరులు ఉన్నారు.

అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ఈవీఎంలపై పదేళ్లుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. 5 వీవీ ప్యాట్స్ స్లిప్పులు లెక్కించాక తేడా వస్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పులు సరిపోవాలని, అభ్యర్థులు కోరిన చోట మళ్లీ ఓట్లు లెక్కించాలని అన్నారు. పారదర్శకత ఉంటే వీవీ ప్యాట్స్ స్లిప్పులు లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటి? అని ప్రశ్నించారు. 

More Telugu News