Telangana: ఏటీఎం సెంటర్ వద్ద భారీ దోపిడీ.. రూ.70 లక్షలున్న పెట్టెను ఎత్తుకెళ్లిపోయిన దుండగులు!

  • హైదరాబాద్ లోని వనస్థలిపురం వద్ద ఘటన
  • డబ్బులు నేలపై పడ్డాయని దృష్టిని మరల్చిన దొంగలు
  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు భారీ దోపిడీ చోటుచేసుకుంది. ఓ ఏటీఎం కేంద్రం వద్ద గార్డులను బురిడీ కొట్టించిన దుండగులు ఏకంగా రూ.70 లక్షల నగదును ఎత్తుకెళ్లిపోయారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన వనస్థలిపురంలోని పనామా కూడలి వద్ద చోటుచేసుకుంది.

ఈరోజు మధ్యాహ్నం యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సెక్యూరిటీ సిబ్బంది నగదును తీసుకొచ్చారు. అంతలోనే అటుగా వచ్చిన ఓ వ్యక్తి నగదు కింద పడిపోయిందని సిబ్బంది దృష్టిని మరల్చాడు. అంతలోనే అతని సహచరులు రూ.70 లక్షల నగదు ఉన్న పెట్టెను ఎత్తుకెళ్లిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది తేరుకునేలోగా ఇతను కూడా ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.

దీంతో వీరంతా పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన వనస్థలిపురం పోలీసులు ఏటీఎం దగ్గరకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. రద్దీగా ఉండే వనస్థలిపురంలో పట్టపగలు ఈ ఘటన చోటుచేసుకోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News