Andhra Pradesh: ప్రియుడిని రక్షించేందుకు భర్త కళ్లలో కారం చల్లిన భార్య

  • భార్యతో గొడవపడి వేరుగా ఉంటున్న భర్త
  • వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్య
  • వారిద్దరూ కలిసి ఉండగా చూసి కత్తితో దాడి

భర్త బారి నుంచి ప్రియుడిని రక్షించేందుకు అతడి కళ్లలో కారం చల్లిందో ఇల్లాలు. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వాంబే కాలనీలో నివసిస్తున్న కోసూరు మురళీకృష్ణ భార్యతో గొడవపడి వేరేగా ఉంటున్నాడు. దీంతో ఒంటరిగా ఉన్న భార్య చీమలపాడు గ్రామానికి చెందిన గోకరాజుతో సహజీవనం చేస్తోంది.

శనివారం రాత్రి తన భార్యతో గోకరాజు కలిసి ఉండడాన్ని చూసిన మురళీకృష్ణలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే తన వద్ద ఉన్న గీత కత్తితో గోకరాజుపై దాడి చేసి గాయపరిచాడు. తేరుకున్న మురళీకృష్ణ భార్య.. భర్త బారి నుంచి ప్రియుడిని రక్షించేందుకు అతడి కళ్లలో కారం చల్లింది. అతడు మంటతో విలవిల్లాడుతుండడంతో ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైంది. ఆ తర్వాత తేరుకున్న మురళీకృష్ణ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న గోకరాజుకు చెందిన కొత్త ద్విచక్ర వాహనాన్ని దహనం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన గోకరాజును ఆసుపత్రికి తరలించారు.

More Telugu News