Krishna District: యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడిన మాటలకు అతన్ని వ్యక్తిగతంగా అభినందిస్తా: వల్లభనేని వంశీ సెటైర్లు

  • వైసీపీ అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు దిగారు
  • అప్రజాస్వామిక భాష మాట్లాడారు
  • అందుకే, సన్మానం చేయాలని భావించా

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనను బెదిరించారంటూ గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ఇంటికి వచ్చి తనను సన్మానిస్తానన్నారని వెంకట్రావు ఆరోపించారు. ఈ విషయమై వల్లభనేని వంశీ స్పందించారు.

‘టీవీ 9‘కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకొస్తే, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలో ఫలానా పని చేస్తానని సాధారణంగా ఎన్నికల ప్రచార సమయంలో చెబుతామని అన్నారు. అలాగే, ప్రత్యర్థి పార్టీ వాళ్లు కూడా అలాగే చెప్పుకుంటూ ఉంటారని చెప్పారు. అయితే, వైసీపీ అభ్యర్థులు తమ పరిధి దాటి వ్యక్తిగత దూషణలకు దిగారని అన్నారు. అప్రజాస్వామికమైన భాష మాట్లాడిన వాళ్లకు సన్మానం చేయాలని భావించానని, అందుకే, ఒక శాలువా, దండ కొన్నానని, ‘దండ వేస్తాను’ అని తాను చెప్పిన మాట వాస్తవమేనని వ్యాఖ్యానించారు.

యార్లగడ్డ వెంకట్రావుకు ఎలాంటి సన్మానం చేస్తారన్న ప్రశ్నకు వల్లభనేని వంశీ స్పందిస్తూ, ‘చూస్తారుగా, వెండితెర మీద’ అంటూ నవ్వులు చిందించారు. యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడిన మాటలకు అతన్ని వ్యక్తిగతంగా అభినందిద్దామని అనుకున్నానని అన్నారు.

More Telugu News