Fani: ఫణి ఎఫెక్ట్... ఒడిశాలో 29కి చేరిన మృతుల సంఖ్య

  • వివరాలు వెల్లడించిన సీఎం నవీన్ పట్నాయక్
  • బాధితులను ఆదుకుంటామంటూ ప్రకటన
  • తుపాను ప్రభావిత గ్రామాల్లో 15 రోజుల పాటు ఉచితంగా ఆహారం

బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి కారణంగా ఒడిశాలో 29 మంది మరణించారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. ఒక్క పూరీ జిల్లాలోనే గరిష్టంగా 21 మంది ప్రాణాలు విడిచినట్టు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుతెచ్చుకున్న పూరీ పట్టణం దారుణంగా దెబ్బతిన్నదని అన్నారు. రాష్ట్రంలో వందల కోట్ల మేర నష్టం వాటిల్లిందని, విద్యుత్, సమాచార వ్యవస్థలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని వెల్లడించారు.

శుక్రవారం పూరీ వద్ద ఫణి తీరం దాటిన నేపథ్యంలో లక్షల మంది నిరాశ్రయులయ్యారని పట్నాయక్ తెలిపారు. తుపాను కారణంగా పూర్తిగా నష్టపోయిన కొన్ని గ్రామాల్లో కుటుంబానికి రూ.2 వేలు, 50 కిలోల బియ్యం, పునరావాస సామాగ్రి అందజేస్తామని చెప్పారు. తుపాను బాధిత గ్రామాల్లో 15 రోజుల పాటు ప్రభుత్వమే ఉచితంగా ఆహారం అందిస్తుందని సీఎం పేర్కొన్నారు.

More Telugu News