Andhra Pradesh: ఎన్నికలు కాగానే జగన్ విహారయాత్రకు వెళ్లిపోయారు.. ప్రజలను పట్టించుకోలేదు!: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • ఫణితో ప్రజల ఇబ్బందిని జగన్ పట్టించుకోలేదు
  • ప్రజలకు మేలు చేయాలన్న తపన బాబులోనే ఉంది
  • విజయవాడలో మీడియాతో టీడీపీ ఎమ్మెల్సీ

ఏపీలో ఎన్నికలు అయిపోగానే వైసీపీ అధినేత జగన్ విహారయాత్రకు వెళ్లిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఫణి తుపాను ప్రభావంతో ఏపీ ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో పనిచేశారనీ, నష్టాన్ని తగ్గించగలిగారని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేయాలన్న ఏకైక తపన ఉన్న నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడాడు.

జగన్ వ్యవహారశైలితో ఆ పార్టీ మద్దతుదారులు బాధపడుతున్నారనీ,  తాము వైసీపీకి ఎందుకు ఓటేశామా? అని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. 70 ఏళ్ల‌ వయసులో కూడా ప్రజలకు ఏదో చేయాలనే ఆరాటం‌ చంద్రబాబుదేనని కొనియాడారు.

పోలవరం పూర్తి చేసి ఏపీని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే చంద్రబాబు లక్ష్యమని, బాబు పాలనను రాముడు పాలనతో ప్రజలు పోల్చుకుంటున్నారని వెంకన్న వ్యాఖ్యానించారు. ఏపీలో తాగునీరు, కరెంటు కష్టాలు లేకుండా చంద్రబాబు చేసి చూపారని కితాబిచ్చారు. దేశం మొత్తం మోదీ ఓడి పోవాలని కోరుకుంటోందని స్పష్టం చేశారు.

More Telugu News