Bhadradri Kothagudem District: కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి ఎందుకు వెళ్లారు : పినపాక ఎమ్మెల్యే రేగాను నిలదీసిన ఓటర్లు

  • ఎన్నికల ప్రచారంలో భాగంగా రెడ్డిపాలెం వెళ్లిన రేగా కాంతారావు
  • టీఆర్‌ఎస్‌ తరపున ఎలా ప్రచారం చేస్తారంటూ నిలదీత
  • దీంతో ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావుకు నిన్న చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై గెలిచిన కాంతారావు ఇటీవల అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణలో ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన కాంతారావును బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామస్థులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీపై అభిమానంతో మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు టీఆర్‌ఎస్‌లోకి ఎందుకు వెళ్లారంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికై టీఆర్‌ఎస్‌ తరపున ఎలా ప్రచారం చేస్తారంటూ అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట వరకు వెళ్లింది. వివాదం ముదురుతుండడం గుర్తించిన ఎమ్మెల్యే ఎందుకొచ్చిన తంటా అంటూ గ్రామంలో ప్రచారం నిర్వహించకుండానే వెనుదిరగడం గమనార్హం.

More Telugu News