Andhra Pradesh: వివాహేతర సంబంధం ఎఫెక్ట్.. ప్రియుడి ఇంటికెళ్లి కత్తితో దాడిచేసిన భర్త!

  • తీవ్రగాయాలతో తప్పించుకున్న బాధితుడు
  • కృష్ణా జిల్లాలో ఘటన
  • హెచ్చరించినా వివాహేతర సంబంధం మానుకోని వైనం

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం నచ్చని ఓ భర్త ఆమె ప్రియుడిపై కత్తితో వెంటపడి దాడిచేశాడు. ఈ ఘటనలో బాధితుడు త్రుటిలో తప్పించుకున్నాడు. కృష్ణా జిల్లాలో నిన్నరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని గుడివాడ వాంబే కాలనీలో మురళీకృష్ణ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన గంగరాజుతో ఇతనికి పరిచయం ఏర్పడింది. దీంతో మురళీకృష్ణ ఇంటికి గంగరాజు వచ్చిపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో గంగరాజుకు మురళీకృష్ణ భార్యతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న మురళీకృష్ణ భార్యను, గంగరాజును తీవ్రంగా హెచ్చరించాడు. అయినా గంగరాజు పద్ధతి మానుకోలేదు.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య ఈ విషయమై మరోసారి గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన మురళీకృష్ణ కత్తి, కారంపొడి తీసుకుని గంగరాజు ఇంటికి వెళ్లాడు. తలుపు తీసిన గంగరాజు కళ్లలో కారం కొట్టి కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన గంగరాజు ఎలాగోలా ఘటనాస్థలం నుంచి పారిపోగలిగాడు. దీంతో కోపం తగ్గని మురళీకృష్ణ అతని బైక్ పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాగా, ఈరోజు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మురళీకృష్ణను అరెస్ట్ చేశారు.

More Telugu News