Andhra Pradesh: గ్రూప్-2 పరీక్షకు సిద్ధమైన ఏపీ యువతి.. కరెంట్ షాక్ రూపంలో కబళించిన మృత్యువు!

  • ఆంధ్రాలోని విశాఖపట్నంలో ఘటన
  • గ్రూప్-2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న కోమలి
  • బాత్రూమ్ లో కరెంట్ షాక్ తో దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యేందుకు సిద్ధమైన ఓ యువతి అనుకోకుండా ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని చీడికాడ మండలం ఖండివరం గ్రామానికి చెందిన యువతి కోమలి గ్రూప్-2 పరీక్షలకు దరఖాస్తు చేసింది. ఈరోజు ఏపీ అంతటా గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హాల్ టికెట్ సహా అన్నింటిని సన్నద్ధంగా ఉంచుకున్న యువతి బాత్ రూమ్ లోకి వెళ్లింది.

అక్కడ స్విచ్ఛ్ లను ఆఫ్ చేస్తుండగా ఒక్కసారిగా షాక్ తగిలింది. నేల తడిగా ఉండటం, గోడల్లో విద్యుత్ ప్రసారం అవుతుండటంతో కోమలి అక్కడే పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే కోమలి అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News