Chandrababu: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

  • టీడీపీ ఓడిపోవాలని కేసీఆర్ కుట్రలు చేశారు
  • హైదరాబాదు నుంచి ఏపీకి వచ్చే బస్సులను కూడా రద్దు చేశారు
  • ఎంతో మంది విలన్లను తట్టుకుని నిలబడ్డాం

ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలకు పాల్పడ్డారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఓటర్లు ఏపీకి రాకుండా, టీడీపీకి ఓటు వేయకుండా అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. హైదరాబాదు నుంచి ఏపీకి వచ్చే బస్సులను సైతం రద్దు చేశారని మండిపడ్డారు. అయినా ఓటర్లు తమ సొంత వాహనాల్లో వచ్చి, పట్టుదలతో ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఎంతో మంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని అన్నారు. తెలంగాణ కంటే ఏపీ అనేక రంగాల్లో ముందుందని చెప్పారు. అధికారుల్లో చీలిక తెచ్చేందుకు కొందరు యత్నిస్తున్నారని, ఇది మంచిది కాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా పని చేయాలనేదే తన సంకల్పమని చెప్పారు.

ఎన్నికల సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారని... కానీ, ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి రాలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ తప్పు చేసిందని ఏ ఒక్కరైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. తొలి దశలో ఎన్నికలను నిర్వహించడమే మేలైందని చెప్పారు.

More Telugu News