burhan wani: ఉగ్రవాది బుర్హాన్ వనీ అనుచరుడి హతం.. గ్యాంగ్‌లోని 11 మందినీ లేపేసిన సైన్యం!

  • లతీఫ్ టైగర్ కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న సైన్యం
  • శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతం
  • తుడిచిపెట్టుకుపోయిన బుర్హాన్ వనీ గ్యాంగ్

కశ్మీర్‌లోని బుర్హాన్ వనీ నేతృత్వంలోని 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సైన్యం తెలిపింది. ఈ మేరకు ఓ ఫొటోను విడుదల చేసింది. శుక్రవారం జమ్ముకశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలోని ఇమామ్‌ సాహెబ్‌ గ్రామంలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో సైన్యం దాడులు జరిపింది. చుట్టుముట్టిన సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

మూడేళ్ల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ అనుచరుడు, కమాండర్ లతీఫ్ టైగర్ కూడా మృతుల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వనీ గ్యాంగులో మొత్తం 11 మంది ఉగ్రవాదులు ఉండగా, తాజాగా లతీఫ్‌ను మట్టుబెట్టడంతో మొత్తం గ్యాంగ్ తుడిచిపెట్టుకుపోయినట్టు అయింది.

జూన్, 2015లో ఈ గ్యాంగ్‌లోని ఉగ్రవాదులందరూ కలిసి ముఖానికి మాస్క్ లేకుండా తీయించుకున్న ఫొటో అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత సైన్యం చేతిలో 10 మంది హతమవగా, తాజాగా లతీఫ్ టైగర్ కూడా హతమవడంతో గ్యాంగ్ కథ ముగిసింది. ఇతడి కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నట్టు సైనికాధికారి ఒకరు తెలిపారు. మిగతా ఇద్దరిని తారిక్ మౌల్వి, షారిక్ అహ్మద్‌గా గుర్తించారు.  

More Telugu News