Odisha: ఈ తాబేళ్లు ఫణి తుపానును ముందే పసిగట్టాయా?

  • రుషికుల్య బీచ్ కు 3000 మాత్రమే ఆలివ్ రిడ్లే తాబేళ్ల రాక
  • గతేడాది ఇదే సమయంలో సందడి చేసిన 5 లక్షల తాబేళ్లు
  • జీవజాతులకు ప్రత్యేక శక్తి ఉంటుందన్న ఐఎఫ్ఎస్ అధికారి

ఒడిశా తీర ప్రాంతానికి పర్యాటకపరమైన గుర్తింపే కాదు, పర్యావరణ పరిరక్షణ పరంగానూ ఎంతో పేరుంది. ఇక్కడి బీచ్ లకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. ఇక్కడి సహజసిద్ధమైన బీచ్ లు ఆ తాబేళ్ల పునరుత్పత్తికి ఎంతో అనువుగా ఉంటాయి. సాధారణంగా వేసవిలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఒడిశా తీరప్రాంతానికి వస్తుంటాయి. అయితే, ఫణి తుపాను నేపథ్యంలో ఈ అరుదైన జాతి తాబేళ్ల జాడ కనిపించలేదు.

కేవలం 3000 కంటే తక్కువ సంఖ్యలోనే ఇక్కడి రుషికుల్య తాబేళ్ల సంరక్షణ కేంద్రానికి చేరుకున్నాయి. ఇదే సమయంలో గతేడాది 5 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు రుషికుల్య వద్ద సందడి చేశాయి. తాబేళ్ల సంఖ్యలో ఇంత భారీ వ్యత్యాసం కనిపించడం ఫణి తుపాను ప్రభావమేనని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.

అనేక జీవజాతులకు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించే శక్తి ఉంటుందని, ఆలివ్ రిడ్లే తాబేళ్లు కూడా ఫణి తుపాను రాకను ముందే పసిగట్టి తీరానికి దూరంగా ఉండిపోయాయని పర్వీన్ కాశ్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే, ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని గహిర్మత బీచ్ కు మాత్రం ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఎప్పట్లానే పెద్ద ఎత్తున వచ్చాయి. మరి ఈ తాబేళ్లు తుపాను గురించి ముందుగా పసిగట్టలేకపోయాయా? అంటే సమాధానం దొరకడంలేదు.

More Telugu News