Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని 6 నెలల క్రితమే చంద్రబాబుకు తెలిసిపోయింది!: గడికోట శ్రీకాంత్ రెడ్డి

  • అందుకే దొంగ సర్వేలు విడుదల చేశారు
  • ఏబీ వెంకటేశ్వరరావును మారిస్తే బాధేంటి?
  • హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ టీడీపీకి కొమ్ముకాస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. డీజీపీపై తాము అనేక ఫిర్యాదులు చేసినా ఈసీ ఆయన్ను బదిలీ చేయలేదని అన్నారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో గతేడాది హత్యాయత్నం జరిగితే ఠాకూర్ ఏ రకంగా ప్రవర్తించారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబుకు 6 నెలల క్రితమే తెలిసిపోయిందనీ, అందుకే ఓటమి నెపాన్ని ఈవీఎంలపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును తప్పిస్తే చంద్రబాబుకు అంత బాధ ఎందుకని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈసీ, వైసీపీ కుమ్మక్కు అయ్యాయంటూ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి తప్పదన్న భయంతో చంద్రబాబు దొంగ సర్వేలు చేయించి విడుదల చేయించారని ఆరోపించారు. నారా లోకేశ్ పై టీడీపీ శ్రేణుల్లో నమ్మకం సన్నగిల్లిందనీ, ఇప్పటికైనా బాబు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.

More Telugu News