Tirumala: టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. ఆగస్టు కోటా 67,737

  • దేవస్థానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన అధికారులు
  • ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో 11,412 టికెట్లు
  • సాధారణ పద్ధతి కోసం 56,325 టికెట్లు కేటాయింపు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెల కోటా టికెట్లను విడుదల చేసింది. మొత్తం 67,737 టికెట్లను విడుదల చేయగా ఇందులో ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో 11,412 టికెట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. మొత్తం టికెట్లను దేవస్థానం వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. అత్యధికంగా  సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు ఉన్నాయి. ఈ సేవ కోసం మొత్తం 15,600 టికెట్లు కేటాయించారు.

ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో కేటాయించే టికెట్లలో సుప్రభాత సేవకు 8,117, నిజపాద దర్శనానికి 2,875, అష్టదళ పద్మారాధనకు 180, తోమాల సేవకు 120, అర్చనకు120 టికెట్లు కేటాయించారు. ఇక సాధారణ పద్ధతి కోసం 56,325 టికెట్లను కేటాయించారు. ఇందులో దీపాలంకరణ సేవకు 15,600, వసంతోత్సవానికి 14,300, కల్యాణోత్సవానికి 13,300, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 7,425, ఊంజల్‌ సేవకు 4,200 టికెట్లు, విశేషపూజకు 1,500 టికెట్లు కేటాయించారు. లాటరీ విధానంలో కేటాయించే టికెట్లు పొందేందుకు పేర్ల నమోదుకు నాలుగు రోజుల సమయం ఇచ్చారు. గడువు పూర్తయ్యాక లాటరీ తీసి టికెట్లు కేటాయిస్తారు.

More Telugu News