Masood Azhar: మోస్ట్ వాంటెడ్ మసూద్ అజర్ పై చర్యలు మొదలు... నోటిఫికేషన్ విడుదల చేసిన పాకిస్థాన్!

  • ఆస్తుల జప్తుకు ఆదేశాలు
  • విదేశీ పర్యటనలపై నిషేధం
  • నిబంధనలకు అనుగుణంగా చర్యలు
  • ప్రకటించిన పాకిస్థాన్

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్, అంతర్జాతీయ ఉగ్రవాదేనని ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్ అతనిపై చర్యలు ప్రారంభించింది. మసూద్ ఆస్తులను జప్తు చేయాలని, ఆయన ఎటువంటి ఆయుధాల కొనుగోలు, అమ్మకాలు జరపరాదని ఆంక్షలు విధిస్తూ, అధికారిక నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది.

ఆంక్షల కమిటీ విధించే నిబంధనలకు అనుగుణంగా మసూద్‌ పై చర్యలు ఉంటాయని ఈ నోటిఫికేషన్ లో పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆయన విదేశీ ప్రయాణాలపైనా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. భద్రతా మండలి నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నామని, నిబంధనల మేరకు ఆంక్షలను తక్షణమే అమలు చేయనున్నామని పేర్కొంది.

 కాగా, మసూద్ ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాల్సిందేనంటూ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆపై చైనా కూడా అభ్యంతరం తెలపకపోవడంతో రెండు రోజుల క్రితం మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువడింది.

More Telugu News