Hyderabad: నిఘానేత్రాన్నే నొక్కేసి... మరో నేత్రానికి దొరికిపోయిన దొంగ... హైదరాబాద్ లో తొలిసారి!

  • సీసీ కెమెరాను దొంగిలించిన శాంతా నాయక్
  • మరో సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
  • రిమాండ్ కు పంపిన పోలీసులు

ఎవరూ చూడటం లేదనుకున్నాడు. నిఘానేత్రాన్నే దొంగిలించాడు. అయితే, ఆ దృశ్యాలు పక్కన ఉన్న మరో సీసీ కెమెరాకు చిక్కాయి. దీంతో సదరు చోరుడికి అరదండాలు పడక తప్పలేదు. ఒక సీసీ కెమెరాను దొంగిలిస్తుంటే, మరో సీసీ కెమెరాలో ఆధారాలు లభించడం హైదరాబాద్ లో ఇదే తొలిసారి.

మరిన్ని వివరాల్లోకి వెళితే, వనపర్తి ప్రాంతానికి చెందిన శాంతా నాయక్ (40)హైదరాబాద్ కు వచ్చి, నందగిరి హిల్స్ లో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. మద్యం తాగడం, పేకాట, అసాంఘిక కార్యకలాపాలు ఇతనికి అలవాటే. గతంలో పోలీసులు శాంతా నాయక్ ను హెచ్చరించారు కూడా.

తాజాగా, తన ఆటోలో ఓ సీసీ కెమెరా వద్దకు వెళ్లిన నాయక్, ఆటో పైకి ఎక్కి, కెమెరా తీగలు కత్తిరించి, దాన్ని పట్టుకు వెళ్లి, పాత ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మేశాడు. సీసీకెమెరా మాయం విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, పక్కనే ఉన్న మరో సీసీ కెమెరాను పరిశీలించగా, విషయం తెలిసింది. తొలుత తాను దొంగిలించలేదని బుకాయించిన శాంతా నాయక్, సీసీ టీవీ ఫుటేజ్ చూపేసరికి అంగీకరించక తప్పలేదు. దీంతో అతన్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు.

More Telugu News