Revanth Reddy: మీది నిజంగా కల్వకుంట్ల వంశమే అయితే.. నాపై దావా వెయ్: కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్

  • పరువు ఉన్నవాళ్లే పరువునష్టం దావా వేస్తారు
  • నేను చేసిన ఆరోపణలకు నేటికీ కట్టుబడి ఉన్నా
  • ఆరోపణలు నిరూపించుకోలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధం

ఇంటర్ బోర్డు వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన గ్లోబరీనా, మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థల వెనక టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఉన్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని బయటపెట్టి తనపై దావా వేస్తానని ప్రకటించిన కేటీఆర్‌కు నిజంగా అంత దమ్మే ఉంటే కేసు వేయాలని సవాలు విసిరారు. ఆయనది కల్వకుంట్ల వంశమే అయితే తనపై కేసు పెట్టాలన్నారు.

కేటీఆర్‌పై తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ తెలిపారు. పరువు ఉన్నవాళ్లే పరువునష్టం దావా వేస్తారని, కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని దావా వేస్తారని దుయ్యబట్టారు. తాను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని తెలిపారు. 20 ఏళ్లుగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)ని కాదని మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్‌కు టెండర్ ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందో కేటీఆర్ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలను నిరూపించుకోలేకపోతే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  

More Telugu News