Andhra Pradesh: విజయనగరం జిల్లాలో ఈదురుగాలులతో వర్షం!

  • విజయనగరంలో పలు చోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా
  • శ్రీకాకుళంలో తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం 
  • రేపు ఉదయం పూరీలో తీరం దాటనున్న ‘ఫణి’

‘ఫణి’ తుపాన్ ప్రభావం కారణంగా విజయనగరం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయనగరం, భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు రాత్రి నుంచి తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారిపై ఈరోజు రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించనున్నారు. జాతీయ రహదారిపై పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నట్టు కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.

‘ఫణి’ తుపాన్ రేపు ఉదయం ఒడిశాలోని పూరీలో తీరం దాటనుంది. తీరం దాటేటప్పుడు ఒడిశా తీరంలో 180 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు విశాఖపట్టణం జిల్లాపైనా ఈ ప్రభావం ఉంటుందని చెప్పారు. తీరం దాటేటప్పుడు సముద్రంలో అలలు ఒకటిన్నర మీటర్ల ఎత్తున ఎగసిపడతాయని తెలిపారు.

More Telugu News