Rabri Devi: లీచీ పండ్లు ఎలా తింటారంటూ మోదీని వ్యంగ్యంగా ప్రశ్నించిన రబ్రీదేవి

  • దీనికి ప్రధాని జవాబివ్వలేరు
  • వాటిని అడిగింది, హీరోనో, హీరోయినో కాదు
  • ప్రణాళిక ప్రకారం అడిగింది కూడా కాదన్న రబ్రీదేవి

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ప్రధాని మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మోదీని బాలీవుడ్ నటుడు అక్షయ్ చేసిన ఇంటర్వ్యూని దృష్టిలో పెట్టుకుని ఆమె ట్వీట్ చేశారు. నాటి ఇంటర్వ్యూలో భాగంగా మోదీని మామిడి పండ్లు తినడం గురించి ప్రశ్నించగా, ఆయన సరదాగా జవాబు చెప్పారు.  

దీనిని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, ‘‘మోదీ మామిడి పండ్లను తినే విధానం చెప్పాక, ముజఫరాపూర్‌లో పండే లీచీ పండ్లను ఆయన ఎలా తింటారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. తోలు వలిచి తింటారా? లేక మింగేస్తారా? వాష్ బేసిన్ దగ్గర నిల్చుని తింటారా..? దీనికి ప్రధాని జవాబివ్వలేరు. ఎందుకంటే ఈ ప్రశ్నలను ఏ హీరోనో, హీరోయినో అడగలేదు. అది ముందస్తు ప్రణాళిక ప్రకారం అడిగింది కూడా కాదు’’ అంటూ సెటైర్ వేశారు. నిన్న ప్రధాని బీహార్లోని ముజఫరాపూర్లో ఎన్నికల పర్యటనకు వచ్చిన సందర్భంగా రబ్రీదేవి ఇలా ట్విట్టర్ లో ప్రశ్నించారు. అయితే, ఈ ట్వీట్‌పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

More Telugu News