Mahesh Babu: మహేశ్ బాబు, పూరీ జగన్నాధ్ ల మధ్య గొడవా? టాలీవుడ్ లో కొత్త చర్చ!

  • మహేశ్ కు రెండు హిట్లిచ్చిన పూరీ
  • 'మహర్షి' వేడుకలో పూరీ మినహా దర్శకులందరినీ గుర్తు చేసుకున్న మహేశ్
  • ఇద్దరి మధ్యా విభేదాలు ఉన్నాయని చర్చ

టాలీవుడ్ హీరో మహేశ్ బాబుకు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కు మధ్య ఏదైనా విభేదాలు వచ్చాయా? సినీ వర్గాల్లో ఇప్పుడు మొదలైన కొత్త చర్చ ఇది. ఇందుకు కారణం కూడా ఉంది. మహేశ్ నటించిన 'పోకిరి' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూరీ, ఆపై 'బిజినెస్ మేన్' పేరిట మరో హిట్ నూ మహేశ్ కు అందించాడు. ఇక తాజాగా మహేశ్ 25వ చిత్రం 'మహర్షి' ప్రీ రిలీజ్ వేడుక, హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది.

ఈ వేడుకలో మాట్లాడిన మహేశ్, తనకు సక్సెస్‌ ఇచ్చిన ఒక్కో దర్శకుడి పేరును చెబుతూ వారికి కృతజ్ఞతలు చెప్పాడు. తన తొలి చిత్రం 'రాజకుమారుడు' దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి తాజా చిత్రం దర్శకుడు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ చెప్పిన ఆయన, మధ్యలో పూరీ జగన్నాథ్ పేరును మాత్రం చెప్పలేదు. 'పోకిరి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన దర్శకుడి పేరు నిజంగానే మహేశ్ కు గుర్తులేదా? అన్న అనుమానాలు ఇప్పుడు సినీ అభిమానుల్లో మొదలయ్యాయి.

వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ లో 'జనగణమన' అనే సినిమా చాలా నెలల క్రితమే అనౌన్స్ అయినప్పటికీ, పట్టాలు ఎక్కలేదు. ఈ సినిమా విషయంలోనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలూ వచ్చాయి. ఇక ఈ విభేదాల చర్చకు చెక్ చెప్పాలని భావించిన మహేశ్, తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పూరికి థ్యాంక్స్‌ చెప్పాడు.

More Telugu News